పోచమ్మ గుడి వీధిలో సి.సి రోడ్డు పనులకు శ్రీకారం
_డ్రైనేజీ వివాదం పరిష్కారం
– ప్రజల సమ్మతితో ముందుకు పనులు
నాచారం, ఏప్రిల్ 1(తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ రాఘవేంద్ర నగర్ పరిధిలోని పోచమ్మ గుడి వీధిలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి చివరకు శ్రీకారం చుట్టారు. గతంలో కార్పొరేటర్గా ఉన్న శాంతి సాయిజెన్ శేఖర్ ఈ రహదారి నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరు చేయించగా, తాజాగా పనులు ప్రారంభమయ్యాయి.మంగళవారం ఉదయం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు రాగా, కొంతమంది స్థానికులు డ్రైనేజీ సమస్యను ప్రస్తావిస్తూ ముందుగా పైపులైన్ మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొంతసేపు పనులు నిలిచిపోయాయి.ఈ విషయంపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం సివరేజ్ సూపర్వైజర్తో చర్చించి, ప్రస్తుతం పైపులైన్ మార్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. మ్యాన్హోల్స్ వద్ద పందికొక్కులు తవ్వడం వల్ల సమస్యలు వస్తున్నాయని గుర్తించి, వాటిని సిమెంట్ ప్లాస్టరింగ్ ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ నిర్ణయానికి స్థానికులు అంగీకరించి, రోడ్డు పనులకు సహకరించారు.దీంతో సి.సి రోడ్డు పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో సోమ శ్రీనివాస్, నరేందర్ గౌడ్, ఉపేందర్ గౌడ్, మన్సూర్, అషు, విఠల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Comments