సిర్సపల్లి డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఆందోళనలు ముమ్మరం
జేఏసీకి మాజీ ఎమ్మెల్యే సంఘీభావం
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. గత పది రోజులుగా నిరంతర దీక్షలు కొనసాగుతుండగా, ఈ పోరాటానికి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఫోన్ ద్వారా సంఘీభావం తెలిపారు. బుధవారం జేఏసీ నాయకులతో మాట్లాడిన ఆయన, డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, పట్టణంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాలల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొని మానవహారం ఏర్పాటు చేశారు. “చెత్త ప్లాంట్ వద్దు – పట్టణాన్ని రక్షించండి” అంటూ నినాదాలు చేస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు, పర్యావరణ ముప్పు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయనీయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్ 4న చేపట్టనున్న నిరసనల నేపథ్యంలో సీఐడీ నోటీసులు అందినట్లు తెలిపారు. 4న సీఐడీ విచారణకు హాజరై, 5న హుజురాబాద్లో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో ఎవరైనా చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.


Comments