పారాక్యాట్ నియంత్రణపై అసెంబ్లీ తీర్మానం సమయోచిత నిర్ణయం
డా. జి. ఆదిత్య రెడ్డి
వనపర్తి,ఏప్రిల్01(తెలంగాణ ముచ్చట్లు):
పారాక్యాట్ (గడ్డి మందు) తయారీ మరియు వినియోగంపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన నిర్ణయంగా నిలిచింది.ఈ నిర్ణయం సమయోచితమని ఏఐపీసీ స్టేట్ ప్రెసిడెంట్ డా. జి. ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరియు సంబంధిత మంత్రులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.పారాక్యాట్ వంటి ప్రమాదకర రసాయనం అనుకోకుండా లేదా ఆత్మహత్యల కోసం వినియోగించబడుతూ తీవ్రమైన విషప్రభావాలకు, అనేక మరణాలకు కారణమవుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ రసాయనం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుందని, దీనికి సమర్థమైన యాంటీడోట్ అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నదని వివరించారు.ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదకర రసాయనాలపై కట్టుదిట్టమైన నియంత్రణ విధించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా పారాక్యాట్ వినియోగంపై పర్యవేక్షణను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో విషప్రభావ ఘటనలను తగ్గించడం, రైతుల్లో అవగాహన పెంపు, సురక్షిత ప్రత్యామ్నాయాల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.ఈ తీర్మానం మానవతా దృక్పథంతో తీసుకున్న బాధ్యతాయుత నిర్ణయంగా నిలుస్తుందని, ప్రజల ప్రాణాలను రక్షించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని డా. జి. ఆదిత్య రెడ్డి అభివర్ణించారు.


Comments