బడి బస్సులు భద్రంగా ఉంచండి.!
- జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు.
- విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం.
సత్తుపల్లి, ఏప్రిల్ 24(తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బడి బస్సులను పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలతో నిర్వహించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జే.ఎన్. శ్రీనివాసరావు సూచించారు. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల నిర్వహణ సంఘం (టీఆర్ఎస్ఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యే ముందు, మే 15వ తేదీ తర్వాత బడి బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈలోపు అన్ని వాహనాలకు అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసి, రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా ఉంచాలని యాజమాన్యాలకు సూచించారు. బ్రేకులు, టైర్లు, లైట్లు వంటి భద్రతా ప్రమాణాలు సరిగా లేని బస్సులను నడిపితే వాటిని సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని, వారి పనితీరుపై యాజమాన్యాలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ఎంఏ జిల్లా నాయకులు గుర్రం కాంతారావు, నాయుడు వెంకటేశ్వరరావు, 
ఎలిశెట్టి నాసరయ్య తదితరులు, జిల్లాలోని వివిధ డివిజన్ల ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారిని ఘనంగా సత్కరించారు.


Comments