కట్నం కోసం కర్కశంగా ప్రవర్తించిన భర్త.. పోలీసులను ఆశ్రయించిన భార్య.
జమ్మికుంట టౌన్ మే 12 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నగరం గ్రామానికి చెందిన కవ్వంపల్లి భాగ్యలక్ష్మి భర్త రమేష్పై అదనపు కట్న వేధింపులు, దాడి, బెదిరింపుల కేసు నమోదు అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, 2012 సంవత్సరంలో నగరం గ్రామానికి చెందిన కవ్వంపల్లి రమేష్తో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం సహా ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించారు.
రమేష్ సింగరేణిలో ఉద్యోగం చేస్తూ ఉండగా, వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం ఉన్నారు. అయితే గత నాలుగు సంవత్సరాలుగా రమేష్ తాగుడుకు బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనపు కట్నం తీసుకురావాలని, లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని తరచూ వేధింపులకు గురి చేశాడని బాధితురాలు తెలిపింది.
ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా, వారు ఈ ఏడాది ఏప్రిల్ 11న రూ.50 వేల నగదును అదనపు కట్నంగా పంపినట్లు వెల్లడించింది. వివాహ సమయంలో ఇచ్చిన నాలుగు తులాల బంగారాన్ని కూడా భర్త కుదువ పెట్టాడని ఆరోపించింది. సమస్యపై నగరం సర్పంచ్ సంపత్ ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినప్పటికీ రమేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది.
తాజాగా మే 11న మద్యం సేవించి ఇంటికి వచ్చిన రమేష్, తలుపులు వేసి భార్యను దూషిస్తూ కర్రతో తలపై దాడి చేశాడని, రక్తస్రావం జరుగుతున్నా “ఈ రోజు నిన్ను చంపుతా” అంటూ గదిలో బంధించి బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Comments