తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి.
దమ్మపేట యార్డ్లో బీజేపీ నేతల ఆందోళన.
దమ్మపేట, మే 9(తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట మార్కెట్ యార్డ్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబళ్ల రవి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యార్డ్కు ధాన్యం వచ్చి నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. లారీలు లేవనే సాకుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని యార్డ్లలో రోజుల తరబడి నిల్వ ఉంచడంతో వర్షాలకు తడిసి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తే బీజేపీ తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో దొడ్డా సతీష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు సొరకాయల సీతారాములు, రైతులు పాల్గొన్నారు.


Comments