వేసవి కాలంలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు.....
–జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్.
Views: 4
On
ఖమ్మం బ్యూరో , మే-05(తెలంగాణ ముచ్చట్లు )
వేసవికాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.
డ్రింకింగ్ వాటర్, సమ్మర్ యాక్షన్ ప్లాన్పై జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరాపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమన్వయం ఉండాలని, ఫీల్డ్ స్థాయిలో అవసరమైన సమన్వయం చేసి సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. పీక్ సమ్మర్ సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ఫీల్డ్లోనే ఉండి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించాలని, ఎంపీడీఓలు, ఎంపీఓలు క్రమం తప్పకుండా ఫీల్డ్ విజిట్లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాసేవలో స్పందన అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
త్రాగునీటి సమస్యలు కేవలం ఆర్డబ్ల్యూఎస్ శాఖకు మాత్రమే సంబంధించినవి కావని, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు కూడా బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మే నెలలో త్రాగునీటి సమస్యలు తలెత్తే అవకాశముండటంతో ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పైప్లైన్ లీకేజీలు, నష్టాలను వెంటనే పరిష్కరించాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే తెలియజేయాలని సూచించారు. రోడ్డు పనుల సమయంలో పైప్లైన్ దెబ్బతిన్నట్లయితే సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా ఖర్చు భరింపజేయాలని తెలిపారు.
మండలాల వారీగా త్రాగునీటి పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్, మొదట మిషన్ భగీరథ నీరు ప్రజలకు చేరేలా చూడాలని, తదుపరి స్థానిక వనరులను వినియోగించాలని, అవసరమైతే బోర్వెల్ ఏర్పాటు చేయాలని, చివరిగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని దశలవారీ చర్యలు సూచించారు.
ఎత్తైన గ్రామాలకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటినీ సరఫరా చేయాలని, సమస్య తలెత్తిన వెంటనే స్పందించాలని తెలిపారు. త్రాగునీటి సమస్యలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన త్రాగునీటి నిధులను జెడ్పీ సీఈఓ సమన్వయంతో అవసరమైన చోట వినియోగించాలని సూచించారు. సరఫరా లేని ఇళ్లను గుర్తించి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.
వేసవి కాలంలో వీధి జంతువులు, చిన్న పక్షులు కూడా నీటి కొరతను ఎదుర్కొంటా యని, గ్రామాలు, మున్సిపాలిటీలలో స్థానిక సంస్థలు చిన్న, చిన్న నీటి గుంతలు (వాటర్ పిట్స్) ఏర్పాటు చేసి వాటికి తగినంత నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
హీట్ వేవ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒఆర్ఎస్ ప్యాకెట్లను పోలీస్ ఎస్హెచ్ఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. సన్స్ట్రోక్ బాధితుల వివరాలను సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, తగిన ఓఆర్ఎస్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
లేబర్ శాఖతో సమన్వయం చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కోచింగ్ సెంటర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు బయట నిద్రించకుండా అవగాహన కల్పించాలని, మార్కెట్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా ప్రదేశాల్లో త్రాగునీరు, ఒఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు, డిపిఓ రాంబాబు, సిపిఓ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మిషన్ భగీరథ ఎస్ఈ, ఈఈ, ఎస్ఈ పి.హెచ్., గ్రౌండ్ వాటర్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఏపిడిలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 22:32:34
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...


Comments