చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం.
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
వనపర్తి,మే03(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు.పెబ్బేరు మార్కెట్ యార్డు, శ్రీరంగాపూర్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.అన్నదాతలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను వెంటనే నమోదు చేసి, విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదు త్వరితగతిన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, శ్రీరంగాపురం మండల నాయకులు శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments