సీఆర్పీలకు బదిలీలు చేపట్టాలి.
ప్రభుత్వాన్ని కోరిన యూనియన్ నేత నాగేశ్వరరావు.
దమ్మపేట, ఏప్రిల్ 29(తెలంగాణ ముచ్చట్లు):
సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న సీఆర్పీలకు బదిలీలు వెంటనే చేపట్టాలని సీఆర్పీ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పాడ్య నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ, మే 1 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, నాన్-టీచింగ్ విభాగానికి చెందిన సీఆర్పీలను కూడా బదిలీల పరిధిలోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 14 ఏళ్లుగా సీఆర్పీలకు బదిలీలు జరగకపోవడంతో భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండటం వల్ల వృద్ధ తల్లిదండ్రులు, పిల్లల సంరక్షణ కష్టమవుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వినతిపత్రాలు పలుమార్లు సమర్పించినప్పటికీ స్పందన రాలేదని, ఈసారి తప్పనిసరిగా బదిలీలు చేపట్టాలని సంఘం తరఫున ప్రభుత్వాన్ని ఆయన కోరారు.


Comments