రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టితే కఠిన చర్యలు.

ఏసీపీ మాధవి హెచ్చరిక.

రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టితే కఠిన చర్యలు.

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడం వల్ల రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఏసీపీ వి. మాధవి గారు గంభీరంగా స్పందించారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులపై వరి పోయడం, టార్పాలిన్ కవర్లు, బండరాళ్లు అడ్డంగా ఉంచడం వలన వాహనదారులు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఈ ప్రమాదాల్లో ముఖ్యంగా రైతు సోదరులే బలవుతుండడం ఆందోళనకరమని ఆమె తెలిపారు. కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, పలువురు కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతింటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“కొన్ని నిమిషాల సౌకర్యం కోసం రహదారులపై ధాన్యం ఆరబెట్టడం… ఒక కుటుంబానికి జీవితాంతం బాధను మిగల్చే ప్రమాదంగా మారుతోంది” అని హెచ్చరిస్తూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
రైతులు తప్పనిసరిగా వరి ధాన్యాన్ని కల్లాల వద్ద లేదా తమ ఇళ్ల ప్రాంగణాల్లోనే ఆరబెట్టుకోవాలని, రహదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని సూచించారు. అవసరమైతే గ్రామ పంచాయతీ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే ఆరబెట్టాలని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రహదారులపై ఎలాంటి అడ్డంకులు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ మాధవి గారు స్పష్టం చేశారు. రహదారులపై ధాన్యం పోసిన వారికి నోటీసులు జారీ చేయడం, అవసరమైతే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రమాదాలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
చివరిగా, “ప్రాణాల కంటే ధాన్యం ముఖ్యమేమీ కాదు” అని పేర్కొంటూ, రైతు సోదరులు పోలీసు శాఖ విజ్ఞప్తిని గౌరవించి రహదారి భద్రత కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News