ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్కు గట్టి వ్యతిరేకం.
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలో భాగంగా శనివారం పద్మశాలి సంఘం హుజురాబాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల చెత్త నుంచి వెలువడే రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో పంటలు పండకపోవడంతో పాటు, కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
అదేవిధంగా చెత్తను కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే డయాక్సిన్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేసి, ప్రజల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రాజెక్టును రద్దు చేయించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వేముల యాదగిరి, విడపు రాజు, చిలుక మారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, మంచికట్ల మురళి, ఎం. రమేష్, ఈ. చంద్రశేఖర్, ఎస్. సత్యనారాయణ, ఎం. బిక్షపతి, ఈ. సాగర్, ఎం. వెంకట్రాజం, ఈ. వెంకటేశ్వర్లు, టి. దేవేందర్, ఎం. విజయ్, టి. సంపత్ కుమార్, ఎం. వెంకటేశ్వర్లు, కే. ప్రభాకర్, కే. రామచంద్రం, జేఏసీ నాయకులు గుడిపాటి జయపాల్ రెడ్డి, వీ. రత్నం, సందేల వెంకన్న, మార్త రవీందర్, వెంకట్రావు, టి. హనుమంతరావు, రాజేశ్వరరావు తదితరులతో పాటు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments