జెడ్పీజీహెచ్ఎస్లో క్రీడా శిబిరాల ఆరంభం.
- డి.ఆనందరావు చేతుల మీదుగా ప్రారంభం.
సత్తుపల్లి, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని అయ్యగారిపేట జెడ్పీజీహెచ్ఎస్ పాఠశాలలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, శారీరక దారుఢ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో యోగా, కరాటే వంటి విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తూ విద్యార్థులను పోటీ స్థాయికి తీర్చిదిద్దే చర్యలు చేపట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ కమిటీ ఛైర్మన్ డి. ఆనందరావు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని ఇలాంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని ఆయన పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, జట్టు భావన వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. నిరంతర సాధనతో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు కీలకమని, ఈ శిబిరాల ద్వారా గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కరాటే ఇన్ఛార్జ్ వి. పిచ్చయ్య, యోగా ఇన్ఛార్జ్ చీకటి.శ్రీదేవి మాట్లాడుతూ శిబిరాల్లో విద్యార్థులకు నిత్య శిక్షణతో పాటు పోటీ స్థాయి నైపుణ్యాలను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని శిబిరాల ప్రారంభాన్ని హర్షధ్వనులతో ఆహ్వానించారు. శిబిరాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


Comments