బంద్ పేరుతో బలప్రదర్శన రాజకీయాలు .
వొడితల ప్రణవ్ ఫైర్.
హుజురాబాద్, మే 9(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రజా సమస్యలను పక్కనబెట్టి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ బంద్ పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ బలప్రదర్శన కోసమే ఈ బంద్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. బయటకు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్టు కనిపిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపల మాత్రం ఒకటేనని, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు.
పీఎంజే షాపు ఘటనపై పోలీసులు వేగంగా విచారణ చేపట్టారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందన్నారు. అలాంటి సమయంలో పోలీసుల పనితీరును అవమానించేలా మాట్లాడటం, బాధ్యతారాహిత్యమని విమర్శించారు. చిన్న సంఘటనలను కూడా రాజకీయ లాభాల కోసం వాడుకోవడం దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజల సమస్యల కంటే సోషల్ మీడియా హడావుడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వారిని పరామర్శించకుండా రాజకీయ హైలెట్ల కోసం తిరుగుతున్నారని మండిపడ్డారు. హుజురాబాద్లో ప్రజల మధ్య తిరగలేక కరీంనగర్లో డ్రామాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇద్దరూ బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. జిల్లాలో ప్రశాంత పరిస్థితులు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరైంది కాదన్నారు.
అలాగే కే టీ ర్,కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆయనలోని అధికార దాహాన్ని బయటపెడుతున్నాయని ప్రణవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, భారీ రుణమాఫీతో పాటు సన్నవడ్లకు బోనస్, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments