ప్రాణాలు కాపాడే తొలి గంటే “గోల్డెన్ అవర్”
రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించాలి
మెడికవర్ వైద్యులు రాజీవ్ రెడ్డి, వేణుగోపాల్ సూచనలు*
హుజురాబాద్, మే 15(తెలంగాణ ముచ్చట్లు ):
రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను వైద్య రంగంలో “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన చికిత్స అందితే మెదడు, వెన్నెముక, అంతర్గత అవయవాలకు జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు.
శుక్రవారం హుజురాబాద్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం అత్యంత అవసరమని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు, వెన్నెముక దెబ్బతినడం, ఎముకలు విరగడం, అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో బాధితుడిని నిర్లక్ష్యంగా కదిలించడం ప్రమాదకరమని, సాధ్యమైనంత వరకు మెడ, వెన్నెముకకు మద్దతు ఇస్తూ అంబులెన్స్లో తరలించాలని సూచించారు.
ప్రమాద స్థలాల్లో గుమిగూడే ప్రజలు వీడియోలు తీయడం కంటే బాధితుడిని రక్షించే దిశగా ముందుకు రావాలని కోరారు. కొంతమంది బాధితులు బయటకు సాధారణంగా కనిపించినా లోపల మెదడు రక్తస్రావం వంటి తీవ్రమైన సమస్యలు ఉండే అవకాశం ఉందన్నారు. తలకు బలమైన దెబ్బ తగిలినప్పుడు తలనొప్పి, వాంతులు, మూర్ఛ, స్పృహలో మార్పులు కనిపిస్తే వెంటనే న్యూరో వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఎముకలు విరిగిన వారిని సరైన పద్ధతిలో తరలించకపోతే శాశ్వత వికలాంగత్వం వచ్చే ప్రమాదం ఉందని, ముఖ్యంగా వెన్నెముక గాయాలున్న వారిని అత్యంత జాగ్రత్తగా తరలించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్సపై ప్రజలకు మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రమాద బాధితులకు సహాయం చేసే వారిపై చట్టపరమైన ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వం “గుడ్ సమారిటన్” నిబంధనల ద్వారా రక్షణ కల్పిస్తోందని తెలిపారు. ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి బాధితులను ఆసుపత్రికి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు.
ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మార్కెటింగ్ హెడ్ కోట కర్ణాకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments