ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర్
ఎల్కతుర్తి, మే 15( తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసం ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఉద్యమ నాయకులు, నాయకురాళ్లను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని ఆయన విమర్శించారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరని, ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2లోపు ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి, సీఎం నివాసం ఎదుట భిక్షాటన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడం దురదృష్టకరమని నిమ్మల మనోహర్ అన్నారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


Comments