పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.. త్వరలో బీఆర్ఎస్ పాదయాత్ర
-- మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్,మే15(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతల ప్రత్యేక సమావేశం జరిగింది.పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న పాదయాత్రపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందిస్తుందని ఆశించి ఇంతకాలం వేచిచూశామని, కానీ ప్రాజెక్టుపై కనీస సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ పాలమూరు–రంగారెడ్డేనని, అనేక అడ్డంకులు ఎదురైనా తమ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఆరు నెలల్లో కరివెన వరకు నీళ్లు తీసుకువచ్చేవాళ్లమని పేర్కొన్నారు.వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన నేతలు, ఇరిగేషన్ ప్రాజెక్టులను పడావు పెట్టారని విమర్శించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా పాల్గొనించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, త్వరలోనే తేదీలు, కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీలు, గోదాములు, హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పండించడానికి మూడు నెలలు, అమ్ముకోవడానికి మరో మూడు నెలలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు, రైతులకు అండగా నిలుస్తామని, ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే వరకు రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, మర్రి జనార్ధన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, వాణీదేవి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, వాల్య నాయక్, ఇంతియాజ్, బీఆర్ఎస్ గద్వాల ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Comments