పల్లెకు వెళ్లొస్తా” అన్న భద్రయ్య.. మృతదేహంగా తిరిగొచ్చాడు.
జమ్మికుంట టౌన్ మే 16 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లె–వీణవంక రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత వారం రోజులుగా వరుస రోడ్డు ప్రమాదాలతో ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఆబాది జమ్మికుంట గ్రామానికి చెందిన పిట్టల భద్రయ్య(50) మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
స్థానికుల వివరాల ప్రకారం.. రైతులు కిలోమీటర్ల మేర రోడ్డుపై వరి ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రమాదాలకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం “పల్లెకు వెళ్లి వస్తా” అంటూ ఇంటి నుంచి బయలుదేరిన భద్రయ్యను వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట వరంగల్కు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
భద్రయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయామని, తమ కుటుంబం రోడ్డున పడిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇప్పటికే ఇదే రహదారిపై ఐదుగురు వరకు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు వార్తలు వచ్చినా అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టవద్దని రైతులకు సూచించే పరిస్థితి కూడా లేదని వాహనదారులు వాపోతున్నారు.
“ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే అధికారులు స్పందిస్తారు..? మా కుటుంబాలను రోడ్డున పడేయొద్దు.. రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా వెంటనే చర్యలు తీసుకోండి” అంటూ బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.


Comments