పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ చట్టం కోసం సంతకాల సేకరణ.
కార్పొరేట్ విద్యా దోపిడీని అరికట్టాలి” : అంగిడి కుమార్
జమ్మికుంట టౌన్ మే 19 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, మెడికల్, ప్రైవేట్ స్కూల్ రంగాల్లో ఫీజుల దోపిడీ రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చడంతో అధిక ట్యూషన్ ఫీజులు, బలవంతపు డొనేషన్లు, హాస్టల్, బస్, మెటీరియల్ పేర్లతో అదనపు వసూళ్లు పెరిగిపోయాయని విమర్శించారు. ఫీజులు చెల్లించలేని పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని పేర్కొన్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులకు గరిష్ట పరిమితి నిర్ణయించాలని, ప్రతి సంవత్సరం అనియంత్రిత ఫీజు పెంపులను అడ్డుకోవాలని, ఫీజుల నిర్ణయంలో ప్రభుత్వ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణచట్టం తీసుకురాకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Comments