పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచిన కేంద్రం.
సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి
ఎల్కతుర్తి, మే 19( తెలంగాణ ముచ్చట్లు):
పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి 90 పైసలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం మోపిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మండిపడ్డారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే దేశ ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు దారుణమన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తూ, మరోవైపు పేదలు, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. కొద్ది రోజుల క్రితం వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్, సిఎన్జీ ధరలను పెంచడం ద్వారా ప్రజల జీవన వ్యయం మరింత పెరిగిందన్నారు.
ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు అధికమై అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా వరుసగా ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2015 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇస్తూ పేదలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరి రాములు, శనగరపు రాజ్కుమార్, లక్ష్మణ్, మర్రి శ్రీనివాస్, గడ్డం రాజనర్సు, మర్రి విజయ్, తండముండయ్య చంద్రమౌళి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments