మక్కల కొనుగోళ్లపై రైతులకు భరోసా ఇచ్చిన వొడితల ప్రణవ్.
జమ్మికుంట టౌన్ మే 19 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో మక్కల కొనుగోలు ప్రక్రియను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మంగళవారం పరిశీలించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్కెట్లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే రైతు ప్రభుత్వమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఐదు మండలాలకు సంబంధించిన రైతుల కోసం జమ్మికుంటలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇప్పటివరకు మార్క్ఫెడ్ ద్వారా సుమారు 72,500 బస్తాలు, 36,250 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేశామని, సోమవారం ఒక్కరోజే 10 వేల బస్తాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మక్కలను పూర్తిగా కొనుగోలు చేసి గోదాములకు తరలించిన అనంతరం మరింత వేగంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మరియు అధికారులు రైతులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం మార్క్ఫెడ్ మరియు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంతో సమావేశం నిర్వహించి, మక్కల కొనుగోలు వేగవంతం అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments