బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ హుజురాబాద్లో టీఆర్ఎస్ నాయకుల ఆందోళన.
హుజురాబాద్ టౌన్ , మే 18(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సోమవారం రాజకీయ ఉద్రిక్తతలకు వేదికైంది. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ కుమారుడిపై అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దీనిపైన నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ చౌరస్తాలో చేరుకున్న నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. “మహిళల భద్రతపై మాట్లాడే బీజేపీ నాయకులు ఇప్పుడు సమాధానం చెప్పాలి”, “బండి సంజయ్ రాజీనామా చేయాలి” అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. నిరసనకారులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. సీఐ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నిరసనకారులను రహదారి నుంచి తొలగించారు. ఆందోళన మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మహిళలపై జరిగే దాడుల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ ఆందోళనలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హుజురాబాద్లో జరిగిన ఈ రాస్తారోకో రాజకీయంగా చర్చనీయాంశమైంది.


Comments