దేవాదాయ శాఖ నిర్ణయానికి అర్చకుల కృతజ్ఞతలు.
ఎల్కతుర్తి, మే 20 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్చకులకు ప్రధాన దేవాలయాల్లో శీఘ్ర దర్శనం కల్పిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అర్చక వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు సదానిరంజన్ సిద్ధాంతి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ డీడీఎన్ పథకం కింద పనిచేస్తున్న అర్చకులు ఇతర ఆలయాలకు వెళ్లినప్పుడు సాధారణ భక్తులతో పాటు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చేదని తెలిపారు. దీంతో వారు సేవలందిస్తున్న ఆలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతోందన్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా త్వరితగతిన దర్శనం పూర్తి చేసుకుని తిరిగి తమ ఆలయాలకు చేరుకునే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.
డీడీఎన్ అర్చకులకు శీఘ్ర దర్శనం కల్పించడం ద్వారా ఆలయ సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ హనుమంతరావు, హనుమకొండ జిల్లా సహాయ కమిషనర్ రాముల సునీతలకు మండల డీడీఎన్ అర్చకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దేవాదాయ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డీడీఎన్ అర్చకులకు ఈ సౌకర్యం అమలులోకి రానుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 458 మంది డీడీఎన్ అర్చకులు ఉన్నట్లు సమాచారం.


Comments