రైతు ఆవేదనకు మహాగర్జన రూపం..
కరీంనగర్లో లక్షలాదిగా అన్నదాతల సమరభేరి
హుజురాబాద్, మే 20(తెలంగాణ ముచ్చట్లు ):
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతు ప్రజాసంఘాల సమైక్య జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న కరీంనగర్లో రెండు లక్షల మందితో పార్టీలకు అతీతంగా రాష్ట్రస్థాయి “రైతుల మహాగర్జన సమరభేరి” సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
బుధవారం జిల్లాలోని మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, సిర్సపల్లి ప్రాంతాల్లో కౌలు రైతులు, ఉపాధి హామీ కార్మికులతో సమావేశాలు నిర్వహించి సభ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రైతు భరోసా నిధులు యాసంగి సీజన్ ముగియనున్నా ఇంకా రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ కాలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు.
పాల ఉత్పత్తిదారులకు గతంలో అందించిన లీటర్కు రూ.4 రాయితీని ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మిల్లర్లు, కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై తాలు, తేమ పేరుతో క్వింటాకు 7 నుంచి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు మృత్యువాత పడటం, మరికొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహాగర్జన సభకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతు నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Comments