ఆన్లైన్ మందుల అమ్మకాలపై హుజురాబాద్ ఫార్మసీల గర్జన
హుజురాబాద్,మే 20(తెలంగాణ ముచ్చట్లు ):
“ప్రజల ప్రాణాలతో ఆటలు ఆపాలి” అంటూ మెడికల్ షాపుల సంపూర్ణ బంద్
ఆన్లైన్ ద్వారా నియంత్రణ లేకుండా జరుగుతున్న మందుల విక్రయాలకు నిరసనగా హుజురాబాద్ పట్టణంలో బుధవారం మెడికల్ షాపులు పూర్తిగా మూతపడ్డాయి. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపుకు మద్దతుగా హుజురాబాద్లోని ఫార్మసీ యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించి తమ ఆందోళన వ్యక్తం చేశారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో మెడికల్ షాపులు మూసివేయడంతో మందులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిరసన చేపట్టినట్లు వ్యాపారులు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కర్ర పాపిరెడ్డి మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “డాక్టర్ ప్రిస్క్రిప్షన్ను సరిగా పరిశీలించకుండా ఆన్లైన్ సంస్థలు మందులు విక్రయిస్తున్నాయి. ఎలాంటి నియంత్రణ లేకుండా భారీ డిస్కౌంట్లతో మందులు అమ్ముతూ స్థానిక వ్యాపారులను దెబ్బతీస్తున్నాయి. ఇది కేవలం వ్యాపార సమస్య కాదు… ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం” అని అన్నారు.
ఆన్లైన్ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తూ మందుల విక్రయాలు జరుపుతున్నాయని, దీనివల్ల నకిలీ మందులు, గడువు ముగిసిన ఔషధాలు ప్రజలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మెడికల్ షాపులు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్లైన్ మందుల అమ్మకాలపై కఠిన నియంత్రణలు అమలు చేయాలని, స్థానిక ఫార్మసీలను రక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


Comments