రైతుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.
ఎల్కతుర్తి, మే 21 (తెలంగాణ ముచ్చట్లు);
ఎల్కతుర్తి మండలంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన మక్కలను కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుల కన్నీళ్లకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు రోజులు తరబడి మక్కల బస్తాలతో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వర్షాలు కురిసే పరిస్థితుల్లో పంట తడిసి నష్టపోతుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మక్కలు కొనుగోలు చేసిన తరువాత కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ కాకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు అప్పులు చేసి పంట సాగు చేశారని, ఇప్పుడు చెల్లింపులు ఆలస్యం కావడంతో వడ్డీల భారం పెరిగి కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం కనీస బాధ్యతతో వ్యవహరించాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
మక్కల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు కనీస మద్దతు ధర పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ఇలాగే నిర్లక్ష్యం చేస్తే బీజేపీ పార్టీ రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ హెచ్చరించారు.


Comments