పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేనా..?
భీమదేవరపల్లి, మే 21 (తెలంగాణ ముచ్చట్లు)
పేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తొలి విడతలో కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రక్రియ ప్రారంభించగా, మిగిలిన అర్హులు రెండవ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, అర్హత ప్రమాణాల ఆధారంగా కొత్త జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భూమిలేని పేదలు, పాత ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు, తొలి విడతలో అవకాశం దక్కని అర్హులకు రెండవ విడతలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా భీమదేవరపల్లి మండలం ములకనూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన కారణంగానే తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండవ విడతలో అయినా తమకు ఇల్లు మంజూరు అవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అయితే రెండవ విడత లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అర్హులలో ఉత్కంఠ నెలకొంది.


Comments