మడిపల్లి అగ్నిప్రమాద బాధిత గౌడ కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట టౌన్ మే 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఈతవనం, తాటివనం పూర్తిగా దగ్ధమై గౌడ కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశాయి. ఈ ఘటనపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
అగ్నిప్రమాదంతో జీవనాధారం కోల్పోయిన గౌడ సోదరుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే, బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన నష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
బాధితులకు వెంటనే నష్టపరిహారం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే, పరిస్థితిని వివరించారు. అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా చర్చించి సంబంధిత శాఖల ద్వారా బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గౌడ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికులు కూడా బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నారు.


Comments