హనుమాన్ ఆలయానికి మహర్దశ.
రూ.ఇరవై లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రణవ్ శ్రీకారం.
హుజురాబాద్,ఆగష్టు 15(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న హనుమాన్ దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) నుంచి మంజూరైన రూ.ఇరవై లక్షలతో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.
దశాబ్దాలుగా ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ ఏర్పడిన వెంటనే ఆలయ అభివృద్ధి కోసం వొడితల ప్రణవ్కు వినతిపత్రం అందజేశామని, ఇచ్చిన మాట ప్రకారం రూ.ఇరవై లక్షల నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించేలా కృషి చేశారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, ఆలయ చైర్మన్ శంకర్, కమిటీ సభ్యులు, ఈఓ సుధాకర్, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments