గ్రామ దీపికల డిమాండ్లు తీర్చాలి.!
కాంగ్రెస్పై మెచ్చా విమర్శలు.
అశ్వారావుపేట, మే 26 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ దీపికల (వీఓఏలు) న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అశ్వారావుపేట రింగు రోడ్డు వద్ద గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న గ్రామ దీపికల దీక్షా శిబిరాన్ని ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండలను సైతం లెక్కచేయకుండా మహిళలు న్యాయం కోసం రోడ్డెక్కి పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏసీ గదుల్లో సేదతీరుతున్నారని విమర్శించారు. మహిళల కష్టం, ఆవేదన పాలకులకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు కన్నీరు పెట్టుకున్న రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీఓఏలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచామని గుర్తు చేశారు. ప్రస్తుతం పనిభారం పెరిగినా తగిన వేతనం, గుర్తింపు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో వీఓఏలకు రూ.20 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గ్రామ దీపికల సమస్యలను పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం చేపడతామని తెలిపారు. గ్రామ దీపికలందరికీ వెంటనే రూ.20 వేల వేతనం అమలు చేసి, వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కాసాని నాగశేష పద్మ (చంద్రమోహన్) గ్రామ దీపికలకు కొబ్బరి నీళ్లు, భోజనం అందజేశారు. కార్యక్రమంలో జూపల్లి రమణరావు, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, ప్రకాశ్రా
వు, భూక్యా ఉదయజ్యోతి, జజ్జూరపు శ్రీరామ్మూర్తి, సత్యవరపు సంపూర్ణ, నారం రాజ్శేఖర్, జ్యోత్స్న, గోవింద్, జీవన్రావు, తగరం జగన్నాథం, వేలేటి పార్వతి తదితరులు పాల్గొన్నారు.


Comments