ఇందిరా మహిళ శక్తితో జమ్మికుంటలో పండుగ వాతావరణం.
పలు వార్డుల్లో మహిళలకు చీరలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్,
జమ్మికుంట టౌన్ మే 27 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళ శక్తి కార్యక్రమం మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాలు సందడిగా కొనసాగగా, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) స్వయంగా పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు.
ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామితో కలిసి ప్రారంభించిన చైర్మన్, మహిళా సంఘాల సభ్యులతో పాటు అర్హత కలిగిన ప్రతి మహిళకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. చీరలు అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక 6వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ సందర్శనలో మున్సిపల్ చైర్మన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. “హౌసింగ్ బోర్డ్ కాలనీకి నీటి ముప్పు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం.. ప్రజలకు ఇబ్బందులు కలగనివ్వం” అని హామీ ఇచ్చారు. అవసరమైన ప్రాంతాల్లో జేసీబీలతో ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
అనంతరం 26, 22వ వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మెప్మ సిబ్బంది, సీఎల్ఆర్పీలు, ఆర్పీలకు కూడా చీరలు అందజేశారు.
పట్టణవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనగా, చీరల పంపిణీతో వార్డుల్లో పండుగ వాతావరణం నెలకొంది.


Comments