ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ కు కేంద్రం భారతరత్న ప్రకటించాలి: మాజీ ఎంపీ నామ.
ఖమ్మం బ్యూరో , మే28(తెలంగాణ ముచ్చట్లు )
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర అని బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం నాడు ఖమ్మం నగరం లోని లకారం ట్యాంక్ బండ్ నందు ఉన్న 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళ్లు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకుంటున్నట్లు బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం, సినీ మరియు రాజకీయ రంగాల్లో ఆయన సాధించిన ఘనతలు భావితరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయని నామ తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలు, రాష్ట్ర ప్రజల కోసం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు. రాజకీయ నాయకుడిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ తన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, రూ.2 కిలో బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ, పేదలకు గృహ నిర్మాణాలు వంటి కార్యక్రమాలు సామాజిక న్యాయానికి నిదర్శనంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ పథకాలు పేదలకు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో భరోసా కల్పించాయన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజల చిరకాల కోరిక అని నామ పేర్కొన్నారు. ఆయన దేశానికి, తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తించి భారతరత్న పురస్కారం ప్రకటించాలని తాను 17వ లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం ఆనాడు పార్లమెంటరీ పార్టీ నేతగా ఉండి 15వ లోక్సభలో తాను చేసిన పోరాటం అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సహకారం, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పాటు నాటి లోక్సభ స్పీకర్తో ప్రత్యేకంగా మాట్లాడి పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు జరిగిందన్నారు. ఎన్టీఆర్ మరణించిన 17 సంవత్సరాల తర్వాత 2013 తాను తాను ఎంపీ గా ఉన్న సమయంలో ఆ విగ్రహం ఏర్పాటులో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా ఖమ్మంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతకు ఇది నిజమైన నివాళిగా నిలిచిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాల్లో కూడా తాను భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు కృషి చేసినట్లు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేసీఆర్ కూడా తన హయాంలో ఎన్టీఆర్ లా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్ కుమార్, ఆర్జేసీ కృష్ణ తో పాటు పలు మండలాల నుండి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


Comments