విధుల్లో నిర్లక్ష్యం,అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
సీనియర్ జర్నలిస్టు ఎర్రమన్ను బాలరాజు
వనపర్తి,మే27(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అక్రమాలు, విధుల్లో నిర్లక్ష్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టు ఎర్రమన్ను బాలరాజు డిమాండ్ చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల్లో రోజురోజుకు అవినీతి, అక్రమాలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అక్రమాలకు పాల్పడటం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం రాజీ లేని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక జీవో తీసుకువచ్చి, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను శాశ్వతంగా విధుల నుంచి తొలగించేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తప్పనిసరిగా ఉండాలని ఎర్రమన్ను బాలరాజు పేర్కొన్నారు.


Comments