బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలకు రైతులు మోసపోవద్దు.
పెద్దమందడి కాంగ్రెస్ నేతల హెచ్చరిక.
పెద్దమందడి,మే28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమర్శలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. రైతులు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.మరో వారం రోజుల్లో మండలంలోని ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.గత బీఆర్ఎస్ పాలనలోనే రైస్ మిల్లుల్లో భారీ అవకతవకలు జరిగాయని, వాటిపై చర్యలు తీసుకుని అనేక మిల్లుల అనుమతులను రద్దు చేయడంతో ప్రస్తుతం కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.రైతుల సమస్యలను పరిష్కరించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టిందని, కేవలం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments