ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం.
రైతుల ఆవేదన,హరిగోస వర్ణనాతీతం
-- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
పెద్దమందడి,మే27(తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుల ఆవేదన, హరిగోస వర్ణనాతీతంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతులపై ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బుధవారం పెద్దమందడి మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అనంతరం మనిగిల్ల గ్రామంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యంతో పాటు ఉద్దేశపూర్వకంగా రైతులకు సకాలంలో యూరియా అందించకుండా, కరెంట్ సరఫరాలో లోపాలు సృష్టిస్తూ, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితుల కారణంగా రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల వైఫల్యం వల్ల రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షాలకు తడిసి నీటిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో కే. చంద్రశేఖర్ రావు పాలనలో ధాన్యం కొనుగోలు చేసి వారంలోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవని గుర్తు చేశారు.ప్రస్తుతం రేవంత్ పాలనలో రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని దుయ్యబట్టారు. రైతుల ఉసురు తాకి ఈ ప్రభుత్వం ఆగం కాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, రైతుసమితి జిల్లా మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణు యాదవ్, కుమార్ యాదవ్, సేనాపతి, సురేష్ కుమార్, అల్వాల వెంకట్ రెడ్డి, నాగేంద్ర యాదవ్, కురుమూర్తి,మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments