స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు.
ఎల్కతుర్తి, మే 27 (తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో మానవత్వం, స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. దండేపల్లి జెడ్పీహెచ్ఎస్ 2001-2002 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ సహపాఠి కొలిపాక కవిత కుటుంబానికి అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు. ఇటీవల కవిత భర్త అకాల మరణం చెందడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పాత స్నేహితులు అందరూ ఒక్కటై ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కలిసి గ్రూప్గా ఏర్పడి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టసమయంలో తమ స్నేహితురాలికి అండగా నిలబడటం తమ బాధ్యతగా భావించామని వారు తెలిపారు. “నీకు మేమున్నాం” అనే భరోసాను కల్పించడమే తమ చిన్న ప్రయత్నమని పేర్కొన్నారు. సహాయం అందించే సమయంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పప్పుల గంగాధర్, కొలిపాక కృష్ణమూర్తి, మరుపాక కుమార్తో పాటు పలువురు సహపాఠులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ ఇదే ఐక్యతతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.
స్నేహం అంటే కేవలం కలిసి చదువుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో తోడుగా నిలబడటమేనని ఈ ఘటన మరోసారి నిరూపించిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.


Comments