జమ్మికుంట మున్సిపల్ సమస్యల పరిష్కారంలో పాలకవర్గం విఫలం.
కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్.
జమ్మికుంట టౌన్ మే 27 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని 30 వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా విఫలమైందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్ విమర్శించారు. పట్టణ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామికి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిన మున్సిపల్ పాలకవర్గాలు ప్రజల ఆశలు నెరవేర్చలేకపోయాయని ఆయన ఆరోపించారు. జమ్మికుంట 16వ వార్డులో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని, పోలీస్ క్వార్టర్స్ సమీపంలో పందుల సంచారం పెరగడంతో చిన్నపిల్లలకు ప్రమాదం ఏర్పడుతోందని తెలిపారు. పందుల బెడద కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, కొత్తపల్లి వంటి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి మురుగు నీరు ఇండ్లలోకి చేరే పరిస్థితి ఉందన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ సమస్యల పరిష్కారంలో విఫలమైందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ముందంజలో ఉన్న జమ్మికుంట మున్సిపాలిటీ, సమస్యల పరిష్కారంలో మాత్రం వెనుకబడిందని అన్నారు.
కొత్త పాలకవర్గం ప్రత్యేక ప్రణాళికతో అన్ని వార్డులను సందర్శించి డ్రైనేజ్, సీసీ రోడ్లు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి నిర్మాణ అనుమతులు వంటి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ డివిజన్ నాయకుడుజీడి సదానందం తదితరులు పాల్గొన్నారు.


Comments