ప్రజా సమస్యలపై గళమెత్తనున్న భారీ బహిరంగ సభ.
జమ్మికుంట టౌన్ మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఆధ్వర్యంలో జూన్ 4న కరీంనగర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి నాయకులు విస్తృతంగా మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం జమ్మికుంట మండలంలో పలువురు మైనార్టీ, కుల సంఘాల నాయకులను కలిసి సభకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మైనార్టీ షేరియా కమిటీ అధ్యక్షులు జాకీర్ గారిని, ఉపాధ్యక్షులు జాకీర్ మహమ్మద్ గారిని ప్రత్యేకంగా కలిసి సభ ప్రాముఖ్యతను వివరించి, భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే వివిధ కుల సంఘాల నాయకులతో సమావేశమై సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం ఈ సభ కీలకమని తెలిపారు.
నాయకులు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జూన్ 4న కరీంనగర్లో జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి చిలువేరు శ్రీకాంత్, హుజురాబాద్ జేఏసీ ఇంచార్జి చందు యాదవ్, జమ్మికుంట మండల నాయకులు మాడుగుల సందీప్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Comments