తెలుగు జాతి గర్వకారణం ఎన్టీఆర్.
సత్తుపల్లిలో ఘనంగా 103వ జయంతి వేడుకలు
సత్తుపల్లి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు గురువారం సత్తుపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దేశ రాజకీయాల్లో నిలబెట్టిన మహానేత అని కొనియాడారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. పేదల సంక్షేమం, సామాన్య ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రజలకు సేవ చేయాలనే తపన, రాజకీయాల్లో విలువలు పాటించిన నాయకుడిగా ఎన్టీఆర్ ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.


Comments