ఉర్సు ఉత్సవాలకు ముస్తాబైన బిజిగిర్ షరీఫ్ దర్గా.
సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి దర్గా.
జమ్మికుంట టౌన్ మే 27 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ అలై దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా కులమత భేదాలు లేకుండా వేలాది మంది భక్తులను ఆకర్షించే ఈ చారిత్రాత్మక దర్గా, ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో కళకళలాడుతోంది.
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మే 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఉర్సు ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి ఆశీస్సులతో తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ భక్తులు దర్గాను దర్శించుకోనున్నారు.
*
11వ శతాబ్దంలో నిర్మితమైన బిజిగిర్ షరీఫ్ దర్గా తెలంగాణలోనే ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ అలైతో పాటు ఆయన కుటుంబ సభ్యుల సమాధులు ఇక్కడ ఉన్నాయి. విశాలమైన గుట్టలు, ప్రకృతి రమణీయత మధ్య వెలసిన ఈ దర్గా మానవత్వం, సమానత్వం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
*భక్తి పారవశ్యంలో ఉర్సు ఉత్సవాలు*
ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం గుసుల్ షరీఫ్, చాదర్ గుల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన చాదర్లను దర్గా సమాధులకు అలంకరించనున్నారు. రాత్రి సంధల్ షరీఫ్ కార్యక్రమాన్ని మొల్లపల్లి, పెద్ద బిజిగిర్ షరీఫ్ గ్రామాల భక్తులు మేళతాళాల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు.
అదేవిధంగా ఖవ్వాలి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఖవ్వాలి బృందాలు మహ్మద్ ప్రవక్త ఉపదేశాలను ఆలపించనున్నాయి. వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
*ప్రజాప్రతినిధుల రాక*
ఉర్సు ఉత్సవాలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వొడితెల ప్రణవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగూరి ప్రశాంత్ దిలీప్ తదితర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
*ప్రత్యేక బందోబస్తు – విస్తృత ఏర్పాట్లు*
ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. త్రాగునీరు, వైద్యం, విద్యుత్, వసతి, బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దర్గా కమిటీ తెలిపింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో దర్గాను అలంకరించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తున్నారు.
*మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం*
హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు తదితర అన్ని మతాల ప్రజలు కలిసి పాల్గొనే ఈ ఉర్సు ఉత్సవాలు దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. “మానవత్వమే మతం” అనే సందేశాన్ని చాటుతూ బిజిగిర్ షరీఫ్ దర్గా సర్వమత సమ్మేళనానికి చిరస్మరణీయ వేదికగా కొనసాగుతోంది.


Comments