ఎన్టీఆర్ ఆశయాలు ఆదర్శం.
గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నివాళి.
దమ్మపేట, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత ఎన్టీఆర్ రాజకీయాలతో పాటు సినీరంగంలోనూ విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. తెలుగువారి గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.


Comments