68 లక్షల మోసం.. బిల్డర్పై బాధితురాలి ఆరోపణలు.
ఖమ్మం బ్యూరో , మే 30(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం రూరల్ మండలంలోని చిన్న వెంకటగిరి మహాలక్ష్మి టౌన్షిప్లో ఇల్లు నిర్మిస్తానని నమ్మించి రూ.68 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ బిల్డర్ మొర్రినేకల సత్యనారాయణపై బాధితురాలు కామా కళావతి ఆరోపించారు. శనివారం గట్టయ్య సెంటర్లోని ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తన గోడును వెల్లడించారు.
కామా కళావతి మాట్లాడుతూ, ఎదులాపురం 12వ వార్డు మాజీ కార్పొరేటర్గా పరిచయం చేసుకున్న మొర్రినేకల సత్యనారాయణ తమకు ప్లాట్, బోర్వెల్, భవన నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తానని హామీ ఇచ్చి రూ.68 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు. అడ్వాన్స్తో పాటు బ్యాంకు రుణం ద్వారా మొత్తం రూ.63 లక్షలు చెల్లించిన అనంతరం గత నవంబర్లో గృహప్రవేశం కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
అయితే ఇంటికి సంబంధించిన అనేక పనులు పూర్తి కాకపోవడంతో బిల్డర్ను పలుమార్లు సంప్రదించినా స్పందించలేదని ఆరోపించారు. ఇంటి బోర్వెల్లో నీరు రాకపోవడంతో పరిశీలించగా కేవలం 20 అడుగుల లోతులోనే బోర్ వేసిన విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కనీసం 250 అడుగుల లోతు లేకుండా నీరు వచ్చే అవకాశం లేదని తెలిసినా తమను ఉద్దేశపూర్వకంగా మోసం చేశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ప్రాణహాని హెచ్చరికలు చేశాడని వాపోయారు.
ఈ విషయమై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డర్ కారణంగా తమకు సుమారు రూ.10 లక్షల మేర అదనపు నష్టం వాటిల్లిందని, నెలకు రూ.50 వేల ఈఎంఐ చెల్లిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. బిల్డర్ మొర్రినేకల సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.


Comments