చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
జమ్మికుంట టౌన్ మే 30 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో చిట్టీ డబ్బుల వివాదం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన అరుకాల సాయికుమార్ అనే యువకుడు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.
స్థానికుల వివరాల ప్రకారం, సాయికుమార్ జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.6 లక్షల మేర చిట్టీ డబ్బులు కట్టినట్లు తెలిసింది. అయితే గడువు ముగిసినప్పటికీ తన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, తనకు చెందిన బంగారు గొలుసు, క్రెడిట్ కార్డులను కూడా తిరిగి అందించడం లేదని అతడు ఆరోపించాడు.
ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికుమార్, “ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను” అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేస్తూ పురుగుమందు సేవించినట్లు సమాచారం.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి అతడిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments