రైతుల రాకపోకలకు ఆటంకం వద్దు.. అధికారులకు మున్సిపల్ చైర్మన్ సూచన.
జమ్మికుంట టౌన్ జూన్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం శివారు కొత్తపల్లి సబ్ స్టేషన్ నుంచి రామన్నపల్లి రైతులు వ్యవసాయ పనుల కోసం వినియోగించే రహదారిపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ స్థానిక ఎంఆర్వోతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
కొత్తపల్లి సబ్ స్టేషన్ పరిసరాల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు గోడ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో రైతులు తమకు ఉపయోగపడే రహదారి మూసివేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ వెంటనే అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాదాస్పద స్థలం రైతుల రహదారికి సంబంధించినదా లేదా ఎన్పీడీసీఎల్ పరిధిలోనిదా అనే అంశాన్ని అధికారులు స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. రైతులకు చెందిన రహదారి అయితే ఎన్పీడీసీఎల్ అధికారులు వెనక్కి తగ్గాలని, ఒకవేళ సంస్థకు సంబంధించిన స్థలం అయితే రైతులకు ప్రత్యామ్నాయ మార్గం కల్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రామన్నపల్లి రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


Comments