రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి.
- ఖరీఫ్కు ఉచిత విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలని ఏఐయుకేఎస్ డిమాండ్.
దమ్మపేట, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఉచితంగా అందించడంతో పాటు పాత వ్యవసాయ రుణాలను రద్దు చేసి, వడ్డీ లేని కొత్త రుణాలు మంజూరు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ రైతాంగానికి అవసరమైన వ్యవసాయ పనిముట్లను సగం సబ్సిడీపై ప్రభుత్వం అందించాలని కోరారు. పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కల్తీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాలను అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన అరటి, మామిడి తదితర పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడం ప్రజలపై అదనపు భారం మోపుతోందన్నారు. రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులకు పూర్తి రుణమాఫీ చేసి, వడ్డీ లేని కొత్త రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. భూమిలేని పేదలకు భూమి, ఇల్లు లేనివారికి ఇల్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వ్యవసాయాన్ని విదేశీ, దేశీయ కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను నిలిపివేసి రైతుల ప్రయోజనాలను కాపాడాలని అన్నారు. కార్యక్రమంలో పాల్వంచ డివిజన్ అధ్యక్షుడు పడూరి వీరబాబు, మండల అధ్యక్షుడు కుంజ కాంతారావు, తామ రాముడు, కుంజ పాపారావు, తెల్లం నాగేష్, వాడే గిరి, చాప ముత్యాలరావు, ఊకే మహేష్, కేసరి వెంకటేష్, ప్రసాద్, శీలం రాజు, కుంజ రవి, ధారబోయిన మంగ తదితరులు.


Comments