ఎంపీడివో కార్యాలయం ఎదుట సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా.
హుజూరాబాద్, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్లోని ఎంపీటీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ హుజూరాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను వినిపించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులకు గత ఎనిమిది సంవత్సరాలుగా వేతనాలు పెంచకపోవడంతో జీవనోపాధి కష్టతరంగా మారిందన్నారు. ప్రస్తుతం రూ.9,500 వేతనంతో కుటుంబాలను పోషించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనాన్ని రూ.26,000లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి, మెటీరియల్ సరఫరాదారులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు, వారి పిల్లలకు విద్యా, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సమావేశంలో తీర్మానించారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.


Comments