రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతు ఎంజీఎం మృతి.
జమ్మికుంట టౌన్ మే 31 (తెలంగాణ ముచ్చట్లు):
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలంలో విషాదాన్ని నింపింది.
మచ్చుపేట గ్రామానికి చెందిన అలిశెట్టి రామస్వామి (66) ఈ నెల 29న తన బావ గొల్ల జయరాములు, మనవడు గొల్ల నిషిధర్తో కలిసి బిజిగిరి గ్రామంలోని దర్గా వద్ద జరిగిన కందూరు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు.
మార్గమధ్యలో తనుగుల గ్రామ శివారులోని మూల మలుపు వద్దకు చేరుకున్న సమయంలో గుంపుల గ్రామం వైపు నుంచి జమ్మికుంట దిశగా వస్తున్న గుర్తుతెలియని బొలెరో వాహనం అతి వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి వారి బైక్ను ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో రామస్వామి తీవ్రంగా గాయపడగా, ఛాతి భాగంలో బలమైన గాయం కావడంతో పాటు రెండు కాళ్లకు రాపిడి గాయాలయ్యాయి.
గాయపడిన రామస్వామిని మొదట జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం శ్రీరామ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 12:10 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై మృతుడి కుమారుడు అలిశెట్టి నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని బొలెరో వాహన డ్రైవర్ను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


Comments