జమ్మికుంటలో వర్షాకాల సన్నాహాలు.. డ్రైనేజీ నిర్మాణంపై చర్చలు.
జమ్మికుంట టౌన్ మే 31 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు పరిసర ప్రాంతాల్లో వర్షాకాలంలో తలెత్తే వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రాజ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి డ్రైనేజీ నిర్మాణ పనులపై ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో పట్టణంలోని వరద నీరు నాయిని చెరువులోకి చేరకుండా, అలాగే చెరువు నుంచి వచ్చే మత్తడి నీరు పట్టణ ప్రాంతాలను ముంచెత్తకుండా సమగ్ర ప్రణాళికతో డ్రైన్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నాయిని చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులతో అనుసంధానంగా డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
కలెక్టర్ సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రాజ్కుమార్ను మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, ఏఈ వికాస్తో కలిసి కలిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్ఈ రాజ్కుమార్ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, డ్రైన్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు చైర్మన్ వెల్లడించారు.
పట్టణ ప్రజలకు వరదల ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.


Comments