దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయం!
-.- అన్ని మతాల ఆత్మగౌరవ పరిరక్షణే ప్రజా ప్రభుత్వ విధి
- రూ.3.30 కోట్లతో కూసుమంచి గణపేశ్వరాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి
- పుష్కరాల నాటికి భద్రాద్రి పనులు పూర్తి అవుతాయని వెల్లడి
ఖమ్మం బ్యూరో, మే 31(తెలంగాణ ముచ్చట్లు )
దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం (గణపేశ్వరాలయం) పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు రూ.3.30 కోట్ల వ్యయంతో ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.లతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రతి మతం ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కాపాడుతామని.. దేవాలయాలతో పాటు చర్చిలు, మసీదుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఇటీవల సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
గత ప్రభుత్వం భద్రాచలం ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని ప్రకటించి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి ఆలయ సమగ్ర రూపురేఖలు మార్చేందుకు రూ.350 కోట్లు కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారని, వారం పది రోజుల్లోనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భూసేకరణ కోసమే ఇప్పటికే రూ.68 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని, అందులో భాగంగానే గణపేశ్వరాలయ పనులను చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, దేవాదాయ శాఖ అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments