రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు.. అనుమానితులపై పోలీసుల ప్రత్యేక నిఘా.
జమ్మికుంట టౌన్ జూన్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు జమ్మికుంట రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐ రవి, పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం సహాయంతో రైల్వే స్టేషన్ ప్రాంగణం, ప్లాట్ఫారాలు, ప్రయాణికుల సామాన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే మార్గాల ద్వారా మాదక ద్రవ్యాల రవాణా జరిగే అవకాశాల నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, ఎవరైనా మత్తు పదార్థాల విక్రయం లేదా రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని, జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.


Comments