తెలంగాణ స్పూర్తిని చాటిన హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి.
హుజూరాబాద్, జూన్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నల్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమం ప్రారంభంలో మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది కలిసి “జై తెలంగాణ” నినాదాలు చేస్తూ తెలంగాణ స్పూర్తిని చాటారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ నల్ల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రవణ్ కుమార్, ప్రతాప్,వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలను విజయవంతం చేశారు.


Comments